తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా):
తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నా మన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సిరి బొమ్మ రూపంలో గ్రామమంతా ఊరేగింపుగా ఇంటింటికి తీసుకెళ్లి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నీళ్ల బిందెలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో అమ్మవారిని పూజించి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు.
తరువాత అమ్మవారిని దేవాలయానికి తీసుకువచ్చి, భక్తుల దర్శనార్థం గుడి ముందు ప్రాంగణంలో ఉంచి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని సిరిబొమ్మ రూపంలో మూడు సార్లు తిప్పే ఆచారం నిర్వహించారు. అప్పుడు భక్తులు జీడిమామిడికాయలు లేదా అరటిపండ్లతో సిరిబొమ్మను తాకుతూ తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు. ఈ పద్ధతి సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వీక్షించి భక్తి పరవశులయ్యారు.
భక్తులు, కమిటీ సభ్యులు మరియు పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉగాది పండుగ రోజు గ్రామ ప్రజలంతా అమ్మవారి ఆశీర్వాదాలతో ఆనందంగా దర్శనం చేసుకున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా బుట్ట బొమ్మలు, కాళికామాత బొమ్మలతో తీన్మార్ ఊరేగింపు నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఉత్సవంలో మోదుగులమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
Uploaded Video:





