రాజమహేంద్రవరం :
సమాజంలో అతి కీలకమైన ఆయుధం కేవలం ఒక విద్య మాత్రమేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 4వ డివిజన్ రాజేంద్రనగర్లో రౌండ్ టేబుల్ ఇండియా వారి సీఎస్ఆర్ నిధులు రూ. 9 లక్షలతో ఎంపీపీ (సంఘం పాక స్కూల్) స్కూల్లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాఠశాల పరిస్థితిని నక్కా చిట్టిబాబు తన దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల ఆ పనులు చేసేందుకు వీల్లేనందున తాను రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారాన్ని కోరగా వారు వెంటనే స్పందించి సదరు పాఠశాల శ్లాబ్ లీకేజ్లు, మరుగు దొడ్ల అభివృద్ధి తదతర పనులను రూ. 9 లక్షలతో చేపట్టారని అభినందించారు. పాఠశాల అనేది ప్రతి ఒక్కరిది అని అన్నారు. అటువంటి దానికి సమస్య వస్తే ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను శాసన సభ్యుడిగా ఎన్నికైన తరువాత నగరంలో మూడు స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చామని గుర్తు చేశారు. మోరంపూడి స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని రౌండ్ టేబుల్ ఇండియా వారిని కోరగా అందుకు వారు అంగీకరించడం సంతోషించదగిన విషయమన్నారు. అలాగే మరిన్ని పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గత పాలకులు పేదలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చేశారని అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమ్యూనిటీ హాళ్లను పేదలకు అందుకు బాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టిందని, త్వరలోనే ఆ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించనున్నామని తెలిపారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల త్వరగా స్పందించి పరిష్కారం దిశగా ఆలోచనలు చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారని, తన జీవితంలో ఇటువంటి నాయకుడు, ప్రజా ప్రతినిధిని ఎన్నడూ చూడలేదన్నారు. నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పని చేస్తూ అందరి మన్నన్నలు పొందుతున్నారని అన్నారు. అలాగే కార్పొరేటర్గా పాఠశాలతో ఉన్న అనుబంధం, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్, వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి, సెక్రటరీ సూర్య, శ్రీనివాస్, ఆది శంకర్, తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశి నవీన్ కుమార్, బండారు శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీనివాస్, బుడ్డిగ రవి, గూటాల సంజీవ్, గుత్తుల రమేష్, అప్పిరెడ్డి కుమార్, బొట్టా వీరబాబు, శేఖర్, విద్య శాఖ అధికారులు, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.


