విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి):
విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీల్లో భాగంగా అక్రమ గంజాయి రవాణా ప్రయత్నం విఫలమైంది. విశాఖపట్నం జి.ఆర్.పి. ఇన్స్పెక్టర్ శ్రీ సి.హెచ్. ధనంజయనాయుడు ఆధ్వర్యంలో జి.ఆర్.పి. మరియు ఆర్.పి.ఎఫ్. సంయుక్త బృందం సబ్ ఇన్స్పెక్టర్లు కేటీఆర్. లక్ష్మి, కెళ్ళి అనంతరావు, అలాగే ASI/RPF సిబ్బంది తో కలిసి రైల్వే ప్లాట్ఫారాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో కేరళ రాష్ట్రం, పాఠనామిత్త జిల్లాకు చెందిన A.1 లైజు, A.2 సాహుల్ జమాల్ అనే ఇద్దరు వ్యక్తులు కేరళ రాష్ట్రానికి గంజాయి రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారు. వారి వద్ద నుండి దాదాపు 10 కిలోల గంజాయి (విలువ సుమారు రూ.50,000) స్వాధీనం చేసుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ కేటీఆర్. లక్ష్మి సమక్షంలో వారిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.
ఇక మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను గుర్తించేందుకు విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ మరియు ఆర్పిఎఫ్ ఫోర్స్లు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాయి. విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సింహాచలం రైల్వే స్టేషన్ల పరిధిలో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ధనంజయనాయుడు తెలిపారు.


