తాళ్లపూడి, (పున్నమి ప్రతినిధి), మార్చి 20:
ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తాళ్లపూడిలోని మసీదులో ముస్లిం సోదరులకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ విషయాన్ని సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల, మత భేదాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, వైద్యంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో సంస్థ చురుకుగా పాల్గొంటూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటోందన్నారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవాలన్నదే మానవత ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
సంస్థ ద్వారా విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ షేక్ ఖుధాన్ సాహెబ్ రూ.2,000, సుహానా సోలార్ సిస్టమ్స్కు చెందిన షేక్ సాబీర్ భాష రూ.3,000 విరాళంగా అందజేశారు.
అదేవిధంగా మసీదు అవసరాల కోసం సంస్థ అధ్యక్షుడు ఒక మెడికల్ కిట్తో పాటు కొన్ని మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, అంకెం సురేష్, తలారి రామ్మోహన్, గంధం మునేశ్వరరావు తదితరులతో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.



