తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మదన గోపాలస్వామి ఆలయం లో శ్రీ మాత గోవింద మాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం అర్చకులు ఖందగిరి గౌతమ్ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కళ్యాణ కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు గానుగల వరహాలు దంపతులు, కోశాధికారి ముత్తోజు మురళి దంపతులు పీటలపై కూర్చొని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు పట్నాల సతీష్, కార్యదర్శి కడలి కిరణ్ మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. మండలంలోని ప్రముఖులు, సంఘ సభ్యులు సతీసమేతంగా హాజరుకావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఇకపై ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమ ఏర్పాట్లను ఉపాధ్యక్షులు పట్నాల సూరిబాబు, దొంతోజు మూర్తి, ధర్నాలకోట ప్రసాద్, నాగమల్లి మహేష్, కాశీ ప్రసాద్, నాగులకొండ భద్రం సమర్థవంతంగా పర్యవేక్షించారు. మండల విశ్వబ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకకు ఘనత చేకూర్చారు.



