
మహా ముత్తారం, జులై 14, పున్నమి ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రూ.1.20 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని, అలాగే 73.50 లక్షలతో నిర్మించిన సహకార గోదాము, కార్యాలయ నూతన భవనాన్ని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆధునిక సదుపాయాలతో రూపొందిన ఈ భవనాలు మండల పరిపాలనకు, వ్యవసాయ సహకార సేవలకి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని మంత్రి తెలిపారు. అంతకు ముందు అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలకు టైలరింగ్ లో మెలకువలు నేర్పేందుకు అనుభవజ్ఞులతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాస రావు, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏ బాబు, పిఏసీఎస్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సిఈఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

