హైదరాబాద్, అక్టోబర్ 30
(పున్నమి ప్రతినిధి):
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
బుధవారం ఆయన రెవెన్యూ మరియు విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు, పంచాయతీరాజ్, ఆర్&బి విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, వాగులు, కాల్వలు, చెరువుల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉండాలని మంత్రి సూచించారు. స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచి, ప్రజలకు అవసరమైన సహాయం అందించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.


