*భాగస్వామ్య సదస్సు విజయవంతమయ్యేలా పెద్దయెత్తున ఏర్పాట్లు*
*నవంబర్ 14, 15వ తేదీల్లో జరగనున్న సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష
*ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది హాజరవుతారని వెల్లడి
విశాఖపట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి ః వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖపట్టణం వేదికగా జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు విజయవంతమయ్యేలా పెద్దయెత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది అతిథులు విచ్చేస్తున్నారని, అంబాసిడర్లు, కాన్సులేటర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు అందులో ఉంటారని పేర్కొన్నారు. కావున అధికారులంతా సమన్వయం వహించి, అంకితభావంతో పని చేయాలని, ఇప్పటి నుంచే పనిలో నిమగ్నమవ్వాలని నిర్దేశించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సదస్సు జరుగుతుందని, ఇప్పటి నుంచే అధికారులు వేదిక వద్దకు వెళ్లి చేయాల్సిన పనులపై అవగాహన పెంచుకోవాలని, సీఐఐ అధికారులతో సమ్వయం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో సన్నాహక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
*అతిథులు హ్యీపీగా ఫీల్ అవ్వాలి.. ఓ మధురానుభూతిగా నిలవాలి*
దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథులు హ్యాపీగా ఫీల్ అవ్వాలని, ఆ దిశగా ప్రోటోకాల్ వ్యవహారాలు ఉండాలని సమావేశంలో భాగంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ ల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్కులు పెట్టాలని, వచ్చే అతిథులకు కళాకారుల ద్వారా సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాలన్నారు. స్థానిక సంప్రదాయాలను పరిచయం చేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని చర్యలు చేపట్టాలని, వచ్చిన అతిథులకు ఈ సదస్సు ఓ మధురానుభూతిగా నిలవాలని పేర్కొన్నారు. వారు వచ్చి వెళ్లే వరకు గౌరవంగా చూసుకోవాలని, కార్యక్రమ షెడ్యూల్ ఇతర వివరాలను వారికి ముందుగానే లైజన్ అధికారుల ద్వారా అందజేయాలని సూచించారు. ఎక్కడా సమన్వయ లోపం, అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పచ్చని మొక్కలను నాటాలని, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, కార్యక్రమ నిర్వహణ, షెడ్యూల్, ఇతర వివరాలతో కూడిన హోర్డింగ్ లు పెట్టాలని, అతిథులకు కాఫీ టేబుల్ బుక్స్, టూరిస్ట్ మ్యాన్యువల్ బుక్స్ అందజేయాలని సూచించారు.
*రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డెలిగేట్స్ కిట్ల అందజేత, పాసుల జారీ సజావుగా సాగాలి*
@సదస్సు రెండు రోజుల పాటు జరుగనున్న నేపథ్యంలో వచ్చిన అతిథులు, పర్యాటక ప్రాంతాలను, స్థానిక ఆలయాలను సందర్శించే అవకాశం ఉందని, కావున నగర సుందరీకరణ, పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద ఆతిథ్య కార్యక్రమాలకు పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన వేదిక వద్ద హార్టీకల్చర్ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ మేట్ వేయాలని, ఆకర్షనీయంగా ఉండేలా పచ్చని మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మూడు వేల మంది రాకపోకలు, సీటింగ్, భోజన, వసతి ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ ఏర్పాట్లను ప్రణాళికాయుతంగా చేసుకోవాలని, లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశంలోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా సాంకేతికతను వినియోగించాలని, డెలిగేట్ కిట్స్, పాసుల జారీ, ప్రధాన సదస్సు, అనుబంధ సదస్సులు, బ్రేక్ అవుట్ సెషన్ల నిర్వహణ విషయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.
*రాకపోకలు, పార్కింగు వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలి*
@ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం పైభాగంలో పీఎం, సీఎం, ఉప రాష్ట్రపతి నేరుగా ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ లు సిద్దం చేయాలని, అక్కడ నుంచి ప్రధాన వేదిక వద్దకు చేరుకునే మార్గాలను వేయాలని, ఇతర ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులు భాగస్వామ్యం అవుతారని, వారి వాహనాల రాకపోకలు, పార్కింగ్ వసతి తదితర అంశాలను జాగ్రత్తగా డీల్ చేయాలని పేర్కొన్నారు. పీఎం, సీఎం గ్రీన్ రూమ్ లు, బోర్డు, మీటింగు రూములను పక్కాగా సిద్ధం చేయాలని, బ్యాక్ ఆఫీసులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు సదస్సు వద్దే ఉంటారని, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారని, దానికి తగ్గట్టుగా అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఫైర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంటుందని, అక్కడ నుంచే అన్ని రకాల సహాయ, సహకారాలు అందుతాయని అధికారులకు చెప్పారు.


