విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నైతిక విలువలు, నిజాయితీ మరియు ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించాలని ఉపాధ్యాయులు పసుపుల రాజశేఖర్ సూచించారు. తిరుపతి జిల్లా చిట్వేల్ శివాలయంలో ఆదివారం ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్యం మరియు ధర్మానికి ప్రతీకగా నిలిచిన రాజు హరిశ్చంద్రుడి కథను విద్యార్థులకు వివరించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాజు హరిశ్చంద్రుడు తన మాటను తప్పకుండా, ధర్మాన్ని విడువకుండా నిలబడ్డాడని తెలిపారు. తన రాజ్యాన్ని, సంపదను, కుటుంబాన్ని కూడా కోల్పోయినా సత్యాన్ని వదల్లేదని చెప్పారు. చివరకు అతని నిజాయితీ మరియు ధర్మం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు.విద్యార్థులు కూడా హరిశ్చంద్రుడిలా నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. నైతిక విలువలు, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి లక్షణాలు ప్రతి విద్యార్థి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాయిరాం, వెంకట శివ, సునీల్, విద్యార్థులు పాల్గొన్నారు.



