అవస్థల్లో ప్రయాణికులు
పట్టించుకోని అధికారులు
సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లాలోని, చేజర్ల, కలువాయి, రాపూరు మండలాలను కలిపే పెంచలకోన రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో ఉండే గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండలంలోని నెర్నూరు, కొల్లపనాయుడు పల్లి, కలువాయి మండలంలోని దాచూరు, దాసరపల్లి, పెరమకొండ, ముక్కుతిప్ప, గ్రామాలకు వెళ్ళాలంటే రోడ్డు గోతుల మయంగా తయారయ్యి నరకానికి నకలుగా మారింది. సోమశిల – నెల్లూరు రహదారి ఆదూరుపల్లి నుండి గోనుపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్లు ఈ రోడ్డలో ప్రయాణం అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందో అన్న భయం ప్రజల్లో మరియు వాహన యజమానులలో తలెత్తుతుంది. రోడ్డు గోతులతో ఉండడంతో నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికి గోతుల్లో నీళ్లు చేరి గోతులు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.దీంతో ఆయా గ్రామాల ప్రజల అవస్థలు వర్ణణాతీతం. ఏళ్ల తరబడి ప్రజలు అవస్థలు పడుతున్నా అటు నాయకులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గోతులను పూడ్చి అవస్థలు తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.


