విశాఖ గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి):
విజయనగర సామ్రాజ్య మహామహుడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని గాజువాక రాయల్ కూడలిలో ఘనంగా నిర్వహించారు.కాపు సంఘ నేతలు దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నేతలు కరణంరెడ్డి నరసింగరావు,కాతా బాలకృష్ణ,గంధం వెంకటరావు మాట్లాడుతూ దేవరాయల పరిపాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కర్ణాటక,ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి గల పాలకుడు ఆయనని పేర్కొన్నారు.యుద్ధవిద్యలలోనే కాక సాహిత్యరంగంలోనూ అపార ప్రతిభ కనబరిచిన రాయలు తెలుగులో ‘ఆముక్తమాల్యద’ మహాకావ్యాన్ని రచించి సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు.ఆయన పాలన విధానాలు శతాబ్దాలు గడిచినా ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో గుడివాడ అప్పలరామ్మూర్తి,అమ్మన్న,విందుల వెంకటరమణ,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఒకప్పుడు జగ్గు జంక్షన్గా ఉన్న ఈ ప్రాంతం దేవరాయల విగ్రహం ఏర్పాటు అనంతరం రాయల్ కూడలిగా మారి గుర్తింపు పొందిందని నేతలు తెలిపారు.




