కలిగిరి మండలం తూర్పు గుడ్లదొన గ్రామంలో చెరువు వద్ద నిర్వహించిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని చెరువు పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి నీటి నిర్వహణ, చెరువుల అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా సాగునీటి, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు.
అధికారులు, నాయకులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే ఈ లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. గ్రామస్థులు కూడా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం తూర్పు గుడ్లదొన, పడమర గుడ్లదొన, ఎరుకులరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన ఉమ్మడి చెరువు కట్ట విస్తరణ పనులను పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే ప్రాంతంలో సాగునీటి వసతి మెరుగుపడి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



