నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత, మహామహుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి చి. సౌజన్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘మన దేశంలో ప్రతి మతానికి ఓ పవిత్ర గ్రంథం ఉన్నట్టే, అన్ని వర్గాల ప్రజలు అనుసరించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన శిల్పి ఆయనే. న్యాయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అంబేద్కర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు.
అదే విధంగా, ‘‘అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, నిబద్ధతతో సేవలందించిన మహామానవుడు. ఆయన జీవితయాత్ర అనేక ఉద్యమాలకు పునాది వేసింది. రాజ్యాంగం ప్రతీ పౌరుడికి స్వేచ్ఛ, హక్కులు అందించే దిక్సూచి’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీ చంద్రమోహన్, డీసీఆర్బీ సీఐ శ్రీ రామారావుతో పాటు ఇతర పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.