అవినీతి తిమింగలం ఇంట ఏసీబీ సోదాలు రూ.కోట్లలో అక్రమాస్తులు భారీగా ప్రాంసరీ నోట్లు, నగదు, నగలు ఏసీబీ అదుపులో టీజీపి డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీనరసింహం నెల్లూరు, అక్టోబర్ 10 (పున్నమి విలేకరి) : లెక్కకు మించిన ఆస్తులు… లక్షలాదిరూపాయల నగదు నిల్వలు… కేజీల కొద్ది బంగారం … లక్షల కొద్ది ప్రాంసరి నోట్లు… బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు… భారీగా ఎకరాలు కొద్ది భూములు… కళ్లు బైర్లు కమ్మే బంగారు, వజ్రాల ఆభరణాలు… లాకర్లు కొద్ది నగదు నిల్వలు, దస్తావేజులు ఇవి రాపూరు తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ ఎం.లక్ష్మీనరసింహం అడ్డగోలుగా కూడబెట్టిన ఆస్తుల చిట్టా… గత కొద్ది కాలంగా అవినీతే ప్రధాన అజెండాగా అక్రమ ఆస్తులు కూడబెడుతున్నాడంటూ అతని పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈవాళ నెల్లూరు ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం నివాసాలు, స్నేహితుల ఇళ్లు, బంధుపరివారాల పైన ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఇందులో అధికారులకు కళ్లు బైర్లు కమ్మే ఆస్తుల చిట్టాలు బయటపడ్డాయి. జిల్లాలోని కావలి, నెల్లూరులలో ఆర్డీవోగా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న లక్ష్మీనరసింహం గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించారు. పక్కా ఆధారాలు చూసుకున్న ఏసీబీ అధికారులు లక్ష్మీనరసింహం పై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో డైకస్రోడ్డు వద్ద ఉన్న లక్ష్మీనరసింహం ఇంట్లో సోదాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలు, లక్షలాది రూపాయల ప్రాంసరీ నోట్లు నెల్లూరులో నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, కావలిలో ఒక షాపింగ్ కాంప్లెక్సు, 14 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ ప్రాధమికంగా గుర్తించింది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడం, ఆపై అడ్డగోలుగా అందిన మేరకు అక్రమార్జన చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనరసింహంను ఏసీబీ డిఎస్పీ దేవానంద్ శాంతో అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను సేకరించే పనిలో వున్నారు. జిల్లాలో కావలి ఆర్డివోగా పనిచేసిన లక్ష్మీనరసింహం పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులో అవినీతి అధికారికంగా ఆరోపణలున్న టీజీపీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీనరసింహం ఇంటిలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాయనే సమాచారంతో తెలుగు గంగా స్పెషల్ కలెక్టర్ లక్ష్మీ నరసింహం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లక్ష్మీనరసింహంఇంటితోపాటు సమీప బంధువులు స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పనిచేసిన ప్రతిచోటా భారీగా అవినీతి, అక్రమాస్తుల కూడబెట్టారంటూ లక్ష్మీనరసింహం పై కేసునమోదు చేసిన ఏసీబీ. గతప్రభుత్వ హయాంలో కావలి ఆర్డీవో గా పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దగదర్తి విమానాశ్రయం భూసేకరణ లో పేదల భూముల రికార్డులు మార్చి అనర్హులకు కట్టబెట్టినట్లు ఉన్నతాధి కారులకు ఫిర్యాదులు చేశారు.