ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 6 : మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా ఆనందపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం పారదర్శకంగా స్పందించాలని, మొత్తం వ్యవహారాన్ని సీబీఐతో విచారించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నియామకాల విషయంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆనందపురం మండల వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.


