అనపర్తి, జూలై 25 ( రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ వ్యవస్థాపక సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆగస్టు 2న బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సంస్కార ఫౌండేషన్, ఇండియా టర్న్స్ పింక్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో డీఎంహెచ్వో డాక్టర్ కోమలితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవా కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిగా, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు పనిచేసిన తన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని గత నాలుగేళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది నుంచి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను గుర్తించి పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు చెప్పారు.
అందులో భాగంగా ఈ ఏడాది భారతీయం సత్యవాణి, ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ రామచంద్రారెడ్డికి పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో, వైద్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




